కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda reddy) హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకున్నది. వివేకా హత్య కేసులో (Murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (Kadapa MP Avinash reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar reddy) సీబీఐ (CBI) అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం పులివెందులలోని (Pulivendula) భాస్కర్ రెడ్డి నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి భాస్కర్ రెడ్డిని కడప తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి పెద్దసంఖ్యలో చేరుకున్న వైసీపీ (YCP) కార్యకర్తలు, అభిమానులు సీబీఐ అధికారులను అడ్డుకున్నారు. స్వల్ప ఉద్రిక్తత నడుమ ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్లారు. వివేకా హత్యకేసులో ఆరుగురు ప్రధాన నిందితుల్లో భాస్కర్ రెడ్డి ఒకరు. కాగా, సెక్షన్ 130 బీ, రెడ్ విత్ 302, 201 కింద కేసు నమోదుచేసిన సీబీఐ.. భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్నట్లు ఆయన సతీమణికి సమాచారం ఇచ్చారు.
ఇక హైదరాబాద్లో ఉన్న అవినాశ్ రెడ్డి నివాసానికి కూడా సీబీఐ అధికారులు చేరుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్ను అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ కడపలో అరెస్టు చేసింది. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్ని అదుపులోకి తీసుకున్నది. తాజాగా భాస్కర్ రెడ్డిని కూడా అరెస్టు చేయడంతో అవినాశ్ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.