విజయవాడ: కృష్ణా జిల్లా రోడ్లు రక్తసిక్తంగా మారాయి. జగ్గయ్యపేట వద్ద నాగార్జున సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మరణించారు. కాగా, గూడూరు మండలం మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై పర్ణశాల గ్రామం వద్ద ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్కు తీసుకెళ్లారు.
క్షతగాత్రులు అందరూ మచిలీపట్నం గిలకలదిండి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మంత్రి పేర్ని నాని దవాఖానకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గూడూరు ఎస్ఐ మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.