హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణలో స్థానిక అధికారులు సహకరించడంలేదని, ఈ కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ మేరకు నివేదికను సీబీఐ అధికారులు శుక్రవారం హైకోర్టు అందజేశారు. హత్యకేసులో ఢిల్లీ, గాంధీనగర్ ఫోరెన్సిక్ లేబొరేటరీల నుంచి నివేదికలు రావాల్సి ఉందని హైకోర్టుకు సీబీఐ తెలిపింది.
ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు ఎప్పటికి పూర్తిచేస్తామన్న దానిపై నిర్ధిష్ట సమయం చెప్పలేమని స్పష్టం చేసింది. సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు ఈ మేరకు కోర్టుకు నివేదించారు. ఈ ఘటనకు సంబంధించిన తాజా వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టులో దాఖలు చేశామని, నిందితుల అనుచరులు కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి వాహన డ్రైవర్ను బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. వసతుల కల్పన, పరిపాలనాపరమైన అనుమతుల వ్యవహారంలో స్థానిక అధికారుల నుంచి సహకారం అందడం లేదని సీబీఐ అధికారులు చెప్పారు. బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు.
ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి, నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ల విచారణను జూన్ 13కి వాయిదా వేశారు. అప్పటిలోగా ఫోరెన్సిక్ నివేదికలను తెప్పించుకునేందుకు యత్నించాలని సీబీఐకి సూచించారు. సాధ్యపడకపోతే పూర్వాపరాల ఆధారంగా బెయిల్ పిటిషన్లపై విచారణ జరుపుతామని చెప్పారు.