ఏపీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26 నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మంత్రులు క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. రూట్ మ్యాప్, సభల ఏర్పాటు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై సీఎంతో చర్చించారు. మొత్తం 17 మంది మంత్రులు ఈ బస్సు యాత్రలో భాగం కానున్నారు.
ఈ బస్సు యాత్ర మొదట ఉత్తరాంధ్రతో ప్రారంభం కానుంది. ఇక్కడే మొదటి సభ నిర్వహించి, ఈ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీకాకుళంలో తొలి బహిరంగ సభ, రాజమండ్రిలో రెండో సభ, నరసరావు పేటలో మూడో సభ, అనంతపురంలో నాలుగో సభ నిర్వహించనున్నారు. మరోవైపు ఈ బస్సు యాత్రకు ఏం పేరు పెట్టాలన్న దానిపై మాత్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఏపీ సీఎం జగన్ మాత్రం ఈ బస్సు యాత్రకు ఓకే చెప్పారు.