హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): మోదీ బెదిరింపులకు భయపడేది లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. శనివారం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు గురిందపల్లి చిట్టిబాబుమాదిగ నేతృత్వంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం తోట చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దర్యాప్తు సంస్థల్ని ఉసిగొలుపుతూ ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తూ లొంగదీసుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ను ఎదుర్కొలేక కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని బీజేపీ చూస్తున్నదని చెప్పారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్కు కేసులు, కోర్టులు కొత్తేం కాదని, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని తెలిపారు.
బీజేపీది విభజించు, పాలించు సిద్ధాంతమని.. ఆ సిద్ధాంతంతోనే దేశంలోని అనేక రాష్ర్టాల్లో ప్రభుత్వాలను అక్రమమార్గంలో కూల్చారని ఆరోపించారు. తెలంగాణలో ఆ పప్పులేమీ ఉడకటం లేదని, అందుకే జేబు సంస్థలైన ఈడీ, సీబీఐని ఉసిగొలుపుతున్నదని చెప్పారు. తెలుగు రాష్ర్టాల్లో అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటున్నదని మండిపడ్డారు. విభజన హామీలను నెరవేర్చటంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఏపీలో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయించకుండా అవస్థలు పెడుతున్నదని చెప్పారు. మోదీ, జగన్ తీరుతో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం పెరిగిపోయిందని, యువత ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. పెట్టుబడిదారులను ఆకర్షించటంలో వైసీపీ ఘోరంగా విఫలమైందని వెల్లడించారు. లక్షల కోట్ల రూపాయల ఎంవోయూలు కుదిరాయని వైసీపీ గొప్పలు చెబుతున్నదని, కానీ ప్రజలు ఆ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఏపీలో 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీకి అడ్డుకట్ట వేస్తేనే ప్రజలు మెచ్చే పాలన వస్తుందని తెలిపారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉన్నదని హెచ్చరించారు.