తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ఈనె 27న బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. 27న ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కారణంగా డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది .
ఆరు కంపార్టుమెంట్లలో శ్రీవారి దర్శనానికి భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు. నిన్న స్వామివారిని 62,055 మంది భక్తులు దర్శించుకోగా 23,044 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.99 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.