Srikalahasti Fincare Bank Robbery || తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఫిన్కేర్ బ్యాంకు చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ ! తనను కట్టేసి బ్యాంకు దోచేశారని ఫిర్యాదు చేసిన మేనేజరే.. దోపిడీకి అసలు సూత్రధారి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. తన బండారం బయటపడుతుందనే భయంతో బ్రాంచ్ మేనేజర్ స్రవంతి పథకం ప్రకారమే బ్యాంకులో దోపిడీలో నాటకం ఆడినట్లు పోలీసులు గుర్తించారు.బ్యాంకు దోపిడీ కేసులో పోలీసులకు ముందు నుంచి ఇంటి దొంగల పాత్ర మీద అనుమానం ఉంది. దీంతో ఆ కోణంలో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు తెలిశాయి.
అసలేం జరిగిందంటే..
బ్రాంచ్ మేనేజర్ స్రవంతి.. గిల్టు నగలు పెట్టి తాను పనిచేసే బ్యాంకు నుంచి రుణాలు కాజేసింది. అయితే తొందరలోనే బ్యాంకు ఉన్నతాధికారులు ఆడిట్ చేయబోతున్నారని తెలిసి కంగారుపడిపోయింది. ఆడిట్ జరిగితే తన బండారం బయటపడుతుందని భయపడిపోయింది. దీంతో బ్యాంకు దొంగతనం నాటకానికి తెర తీసింది. చెన్నైకి చెందిన ముగ్గురు యువకులతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని బ్యాంకు దోపిడీ డ్రామాకి స్కెచ్ వేసింది. పక్కా ప్లాన్ ప్రకారం గురువారం రాత్రి బ్యాంకులోకి వచ్చిన యువకులకు.. లాకర్లో 67 ప్యాకెట్లలో ఉన్న దాదాపు రెండు కేజీల బంగారం, 5 లక్షల రూపాయల నగదు ఇచ్చి పంపించింది. ఆ తర్వాత దొంగతనం గురించి విచారణ చేపట్టిన పోలీసులకు.. ముసుగుతో వచ్చిన ముగ్గురు యువకులు బ్యాంకుకు కన్నం వేసినట్లు తెలిపింది. తన చేతులు కట్టేసి, అరవకుండా నోటిలో గుడ్డకుక్కి బెదిరించి దుండగులు బ్యాంకు లూఠీ చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్రవంతిని కూడా విచారించారు. ఈ క్రమంలో ఆమె ఒక్కోసారి ఒక్కో సమాధానం చెప్పింది. అలాగే సీసీ టీవీ ఫుటేజీని గమనించగా.. అందులో స్రవంతి వ్యవహారశైలిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో స్రవంతిని విచారించి ఆమె నుంచి అసలు నిజాన్ని రాబట్టారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే బ్యాంకు చోరీకి ప్లాన్ వేసిందని పోలీసులు గుర్తించారు.