తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ జరిగింది. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, అర్చకులు బాలాజీ, సూపరింటెండెంట్ ముని చెంగలరాయులు తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం నుంచి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం ఉదయం 9 నుండి 9.20 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనున్నది. అంతకుముందు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగుతుంది.
కాగా, ఫిబ్రవరి 21న చిన్నశేష వాహనం, హంస వాహనం, ఫిబ్రవరి 22న సింహ వాహనం,ముత్యపుపందిరి వాహనం, ఫిబ్రవరి 23న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, ఫిబ్రవరి 24న పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం, ఫిబ్రవరి 25న హనుమంత వాహనం, స్వర్ణరథం(తిరుచ్చి), గజ వాహనం, ఫిబ్రవరి26న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, ఫిబ్రవరి 27న రథోత్సవం(సర్వభూపాల వాహనం), అశ్వవాహనం ఏకాంతంగా జరుగుతాయి. ఫిబ్రవరి 28న చక్రస్నానం ధ్వజావరోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.