తిరుపతి : వైఎస్ఆర్ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 10 నుంచి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) నిర్వహిస్తున్నామని టీటీడీ( TTD) అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ముందుగా ఈనెల 9న సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని తెలిపారు.
10వ తేదీ ఉదయం 10.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు. 15న స్వామివారి కల్యాణోత్సవం, 19న పుష్పయాగం కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు..
10వ తేదీ ఉదయం ధ్వజారోహణం, రాత్రి చంద్రప్రభ వాహనం, 11న ఉదయం సూర్యప్రభవాహనం, రాత్రి, పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. 12 ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి సింహ వాహనం, 13న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం, 14న ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి గరుడ వాహనం(Garuda Vahanam) , 15న ఉదయం కల్యాణోత్సవం, రాత్రి గజవాహనంపై ఊరేగుతారని తెలిపారు.
16న ఉదయం రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం, 17న ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వ వాహనం, 18న ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి హంసవాహనం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అన్నారు.