Chandrababu | అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం (ఎస్సీ) నియోజకవర్గ టికెట్ను సరిపెల్ల రాజేశ్కు కేటాయించడం పట్ల టీడీపీలో రోజురోజుకీ వివాదాలు ముదురుతున్నాయి. సరిపెల్ల రాజేశ్ ( మహాసేన రాజేశ్)కు టికెట్ కేటాయించడాన్ని ఇప్పటికే జనసేనతో పాటు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రాహ్మణ సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
బ్రాహ్మణులను కించపరిచిన రాజేశ్కు టికెట్ ఎలా ఇస్తారని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. బ్రాహ్మణులను ఓట్లు అడిగే హక్కును చంద్రబాబు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేశ్కు టికెట్ ఇచ్చినందుకు బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన రాజేశ్ దళిత వర్గాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో నుంచి బయటకు వచ్చేశారు. మహాసేన మీడియా పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి అధికార పార్టీని నిలదీస్తున్నారు. పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసినా వెనుకడుగు వేయకుండా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ మహాసేన రాజేశ్గా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆయన జనసేనలో చేరతారని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా టీడీపీలో చేరి పి.గన్నవరం సీటును దక్కించుకున్నారు. కానీ మహాసేన రాజేశ్కు పి.గన్నవరం (ఎస్సీ ) నియోజకవర్గంపై అంతగా పట్టు లేదు.. టీడీపీ కార్యకర్తలతో కూడా టచ్ లేదు. దీంతో స్థానిక నేతలను పక్కనబెట్టి స్థానికేతరుడికి టికెట్ ఎలా ఇస్తారని టీడీపీ శ్రేణులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.