అమరావతి : ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu ) పర్యటన ఏర్పాట్లపై వైసీపీ ఎమ్మెల్సీ, మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కూటమి సర్కార్పై కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై ఒకటిన రాష్ట్రపతి రాష్ట్రంలో పర్యటన సందర్బంగా ఆమెకు ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాటుపై మండిపడ్డారు.
వాస్తవానికి ఆమెకు ప్రభుత్వ అతిధి గృహంలో బస ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రైవేట్ సంస్థకు సంపదను దోచుపెట్టేందుకు రాష్ట్రపతిని ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రం పరువు పోతుందని పేర్కొన్నారు. అవసరం అనుకుంటే ప్రభుత్వ గెస్ట్హౌజ్లను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని, వైసీపీ నాయకులు అమరావతిలో రైతులతో మాట్లడేందుకు వెళ్తే టీడీప గూండాలు దాడులకు పాల్పడి తమపైనే ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చను తీసుకువస్తున్నారని వెల్లడించారు.
అమరావతిలో అక్రమాలు బయట పడతాయనే భయంతో ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. దేశ సంస్కృతికి విరుద్దంగా బీచ్లు, ఎయిర్పోర్టులలో బార్లు పెట్టే ఆలోచనను వ్యతిరేకించారు. ఏపీలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు మొదట నష్టపోయేది రైతులేనని పేర్కొన్నారు.