Vizag MP | విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర కాపు సామాజికవ వర్గం కావడం సానుకూల అంశంగా భావించిన వైసీపీ ఆమెను వైజాగ్ లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు సమాచారం. వైజాగ్ నుంచి ఇప్పటివరకు లోక్సభకు పోటీ చేసినవాళ్లలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అగ్రవర్ణ నేతలే ఉన్నారు. 2004లో ఎంపీగా ఎన్నికైన నెదురుమల్లి జనార్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి వస్తే.. 20009లో దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఎంపీ అయ్యారు. 2014లో కృష్ణా జిల్లాకు చెందిన కంభంపాటి హరిబాబు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇక్కడ గెలిచారు. ఈ క్రమంలో స్థానిక బీసీ నేతకు సీటు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలోని 80 శాతం బీసీలను ప్రభావితం చేయవచ్చని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్నీ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
బొత్స ఝాన్సీకి స్థానికంగా మంచిపేరు ఉంది. ఆమె సైకాలజీలో డాక్టరేట్ చేశారు. ఎంఏ ఫిలాసఫీ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. న్యాయ విద్యలో రెండు పీహెచ్డీలు కంప్లీట్ చేశారు. ఇటీవల హైకోర్టు న్యాయవాదిగా ఏపీ బార్ అసోసియేషన్ సభ్యత్వం కూడా అందుకున్నారు. రాజకీయాల్లోనూ ఆమె రాణిస్తున్నారు. గతంలో జడ్పీచైర్పర్సన్గా ఆమె పనిచేశారు. రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒకసారి బొబ్బిలి నియోజకవర్గం నుంచి ఎన్నికవ్వగా.. విజయనగరం పార్లమెంటు ఏర్పడిన తర్వాత తొలి ఎంపీగా పనిచేశారు. అప్పుడు అశోక్గజపతిరాజుపై ఆమె విజయం సాధించారు.