కోనసీమ జిల్లా : రాజోలు వైసీపీ రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు రాజీనామాలు సమర్పించగా.. తాజాగా ఆ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. బొంతు రాజేశ్వర్రావు పీఆర్, ఆర్డీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ సలహాదారుగా ఏపీ సీఎం జగన్ నియమించారు. ఈ పదవితో ప్రజలకుగానీ, పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకుగానీ ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నందుకే రాజీనామా చేస్తున్నట్లు రాజేశ్వరరావు ప్రకటించారు. రాజేశ్వరరావు రాజీనామాపై వ్యాఖ్యానించేందుకు జిల్లా మంత్రి, సీనియర్ నేతలు ముందుకు రావడం లేదు.
కోనసీమ జిల్లా లక్కవరంలో ఆ పార్టీ అసమ్మతి నేతల సమావేశం రెండు రోజుల క్రితం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో సీనియర్ నేతలు హాజరయ్యారు. దాదాపు 11 ఏండ్ల పాటు కష్ట నష్టాలకోర్చి పార్టీ అభివృద్ధికి పనిచేసినా గుర్తింపు లేదని సమావేశానికి హాజరైన పలువురు సీనియర్ నేతలు వాపోయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమపైనే వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. గతంలో ఓటమి పాలైన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టిన జగన్.. నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు అప్పగించి బొంతు రాజేశ్వరరావు విషయంలో అన్యాయం చేశారని వారు ఆరోపించారు.
సమావేశం అనంతరం బొంతు రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు, పార్టీ శ్రేణులకు న్యాయం చేయలేకపోతున్నందుకే ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గం ఇంఛార్జీగా రాపాక వరప్రసాద్కు అప్పగించడం అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయమని చెప్పారు. తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు.