తిరుపతి : తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో రోగులకు తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బర్డ్ లో అత్యాధునిక నూతన కేంద్రీయ రక్త పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. బర్డ్, శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రికి వచ్చే రోగులకు రక్త పరీక్షలు నిర్వహించేందుకు రూ. 80 లక్షలతో రక్త పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. ఇందులో హేమటాలజీ, సేరాలజి , కోయా గూలేషన్, బయో కెమిస్ట్రీ వంటి రక్త పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు.
స్విమ్స్, రుయా, బయట ఆసుపత్రుల నుంచి వచ్చే రోగులకు కూడా తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో పెథలాజికల్, మైక్రో బయోలాజికల్ టెస్టులు కూడా చేయడానికి అవసరమైన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బర్డ్ ఆసుపత్రిలో ప్రతిరోజు 400 ఓపీ, 20 సర్జరీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు 5 ట్రామా కేసులు, ప్రతినెల కోలియోసిస్ (గూని ఆపరేషన్లు) 5, సెరిబ్రల్ పాలసీ, పోలియో వికలాంగులకు 200 నుంచి 250 ఆపరేషన్లు చేస్తున్నట్లు వివరించారు.
బర్డ్ లో అత్యాధునిక పరికరాలతో కూడిన బ్లడ్ బ్యాంక్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. ఇందులో అత్యధికంగా ప్రతిరోజు 40 నుంచి 45 యూనిట్ల బ్లడ్ స్విమ్స్, రుయా, మెటర్నటీ, బయట ఆసుపత్రులకు అందిస్తున్నట్లు వివరించారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని సందర్శించారు. ఇటీవల గుండె మార్పిడి చికిత్స చేయించుకున్న రోగిని పలకరించారు.