అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి ఉండాలని కొనసాగుతున్న రైతుల నిరసనలకు మద్దతు ఇస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. తాజాగా ఏపీ బీజీపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతి రాజధానికే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కనుంది. అమరావతి అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, అమరావతి రైతుల మహాపాద యాత్రలో పాల్గొంటామని ప్రకటించడంతో నిరసనకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 21న రైతు పాదయాత్రలో పాల్గొంటామని ఆయన వెల్లడించారు.
అమరావతి రైతుల పాదయాత్ర గురువారం వర్షాల కారణంగా తాత్కలికంగా నిలిపివేశారు. గత 15 రోజులుగా అమరావతి రైతులు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుండగా భారీ వర్షాల కారణంగా విరామం ప్రకటిస్తున్నట్లు అమరావతి ఐకాస నేతలు నిర్ణయం తీసుకున్నారు.