ఏపీలోని మూడు రాజధానుల అంశం ఉత్తుత్తి మాటేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు అన్నారు. మూడు రాజధానులంటూ జగన్ ప్రభుత్వం ముందుకెళ్లదని, ఆ దిశగా కూడా ఆలోచించడం లేదని జీవీఎల్ పేర్కొన్నారు. ఇది సాధ్యమయ్యే పనికూడా కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే ప్రజలు కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయన్నారు.
రాజకీయంగా లాభం పొందడం కోసమే ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోందని జీవీఎల్ విమర్శించారు. రైతులను మోసం చేసి, ఈ నినాదాన్ని ఇంకా రాజకీయం కోసం వాడుకుంటే, రైతులను మోసం చేస్తే వారికే బెడిసి కొడుతుందని హెచ్చరించారు.
ఈ మూడు రాజధానుల అంశం ప్రాక్టికల్గా సాధ్యం కాని పని అని వైసీపీకి కూడా తెలుసని, అందుకే గతంలో మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ వెనక్కి తీసుకుందని జీవీఎల్ గుర్తు చేశారు. మూడు రాజధానులకు సంబంధించి, సవరణ బిల్లును గనక తేవాలన్న ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి ఉంటే, మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనే తెచ్చేవారని, ఎందుకు తేలేదని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ఉపన్యాసాల కోసమే ఈ అంశాన్ని వాడుకుంటున్నారని జీవీఎల్ మండిపడ్డారు.