Vijayawada West | విజయవాడ వెస్ట్ సీటు పంచాయతీ రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. పొత్తులో భాగంగా ఈ సీటును ముందుగా జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. దీంతో పోతిన మహేశ్ పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. కానీ ఇంతలో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తు కూడటంతో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ సీటు తమకే కావాలని బీజేపీ పట్టుబడుతోంది. జనసేన కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో అక్కడ సీటు పంచాయతీ ముదురుతోంది.
ఇప్పటికే పొత్తుల కారణంగా బీజేపీ చాలా సీట్లను నష్టపోయింది. కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తుల కోసం చాలా త్యాగాలు చేశామని చెప్పారు. పవన్ కళ్యాణ్ తన బాధను అంతగా చెప్పుకున్నప్పటికీ సీట్ల విషయంలో అటు టీడీపీ, ఇటు బీజేపీ రాజీ పడటం లేదు. జనసేనకు కేటాయించిన వెస్ట్ టికెట్ తమకు కావాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్.. పొత్తులో త్యాగాలు సహజమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ వెస్ట్ సీటు తమదే అని ప్రకటిస్తూ.. గురువారం నాడు బీజేపీ విజయవాడ వెస్ట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. వెస్ట్ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు ముగిశాయని వెల్లడించారు. మూడు పార్టీల అధినేతలు చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పారు. 2014 పొత్తుల ఎక్కల ప్రకారం బీజేపీకే టికెట్ వస్తుందని స్పష్టం చేశారు. పార్టీ డిసైడ్ అయిపోయిందని.. అభ్యర్థి ఎవరనేదే తేలాల్సి ఉందని పేర్కొన్నారు. అభ్యర్థిగా ఎవరు ఎంపికైనా.. వెస్ట్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలోనే పొత్తులో త్యాగాలు సహజమేనని.. బీజేపీ గెలుపు కోసం జనసేన కలిసి రావాలని పిలుపునిచ్చారు. కాగా, బీజేపీ వ్యాఖ్యలపై జనసేన నేత పోతిన మహేశ్ స్పందించారు. పొత్తులో సీటు ఎవరైనా కోరుకోవచ్చని.. కానీ వెస్ట్ సీటు జనసేనకే రావడం న్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు.