శ్రీశైలం : శ్రీశైలం దేవాలయం వద్ద భక్తులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఉదయం బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి డీసీఎం వ్యాన్ ఆలయ దక్షిణ మాడవీధిలోని క్యూలైన్లలోకి దూసుకువచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భక్తులు అక్కడి నుంచి పరుగులు తీయడంతో ప్రమాదం తప్పినట్లయింది. వివరాల్లోకి వెళితే.. ఉదయం తొమ్మిది గంటల సమయంలో లడ్డూ తయారీ కేంద్రానికి అవసరమైన ముడిసరుకులు, నెయ్యి దించేందుకు వచ్చిన విజయ పాలడైరీకి సంబంధించిన వ్యాన్ రెండో నంబర్ గేట్ వద్ద నిలిపారు.
అధికారులు సమక్షంలో సిబ్బంది వాహనం నుంచి నెయ్యిని తరలిస్తుండగా లారీ నెమ్మదిగా కిందకు కదిలి.. డొనేషన్ కౌంటర్, ఆర్జిత సేవా, సామాన్లు భద్రపరిచే క్లాక్రూం మీదుగా క్యూలైన్లను దాటుకుంటూ ఉచిత క్యూలైన్ వద్దకు వచ్చి నిలిచిపోయింది. వాహనం హైడ్రాలిక్ బ్రేక్ ఫెయిల్ అయిన విషయాన్ని గమనించిన డ్రైవర్ అదుపు చేసేందుకు ప్రయత్నించగా.. మరో వైపు సెక్యూరిటీ గార్డులు కాశి, సురేష్ భక్తులను అప్రమత్తం చేస్తూ అందరినీ ప్రమాదం నుంచి కాపాడారు. ఈ సందర్భంగా యాత్రికులు సెక్యూరిటీ గార్డులను అభినందించారు.