చిత్తూరు: తిరుమల గిరుల్లోని ఆకాశగంగ సమీపంలో హనుమంతుడి జన్మస్థలంలో అభివృద్ధి పనులకు తిరుపతి, తిరుమల దేవస్థానం (టీటీడీ) బుధవారం భూమిపూజ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శ్రీ శారదా పీఠం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, శ్రీతులసీ పీర్ సేవన్యలు, చిత్రకూటం పద్మభూషణ్ శ్రీరామభద్రాచార్య మహరాజ్, అయోధ్య, రామజన్మభూమి తీర్థ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద దేవీష్ గిరిజిగిరి తదితరులు పాల్గొన్నారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి సన్నిధిలోని హనుమంతుడి జన్మస్థలం అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించడం పట్ల శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి సంతోషం వ్యక్తం చేశారు. వేదాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ అని, తిరుమల శ్రీవారి ఆలయం ఆంధ్రుల ఆస్తి అని అన్నారు. హనుమంతుడు అంజనాద్రిలో జన్మించాడని, అనేక మంది వేద, శాస్త్ర పండితులు పరిశోధించి ధృవీకరించారని చెప్పారు.
ఈ సందర్భంగా కోర్టు తీర్పుపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామే కానీ, ఆలయానికి ఎలాంటి మార్పులు చేయడం లేదన్నారు. హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టాలని సీఎం జగన్ చేసిన సూచనలు చేశారని, ఎలాంటి వివాదాలకు తావులేకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో కలిపి మొత్తం 502 దేవాలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, హనుమంతుడి జన్మస్థలం అంటూ టీటీడీ భక్తులను మోసం చేస్తుందని హనుమత్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకుడు గోవిందానందా ఇప్పటికే ఆరోపించారు. ఇదంతా ఆదాయం పెంచుకునేందుకే అని మండిపడ్డారు. హనుమంతుడు కర్ణాటకలోని కిష్కిందలో జన్మిస్తే.. తిరుమల కొండపై జన్మించారని ఎలా చెప్తారని టీటీడీ పెద్దలను గోవిందానందా నిలదీశారు.