అమరావతి : భవానీ దీక్షల విరమణ వేడుకలు అమరావతి ఇంద్రకీలాద్రిపై శనివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. భవానీ దీక్షా విరమణలను దుర్గగుడి ఈవో హోమగుండాలు వెలిగించి ప్రారంభించారు. 5రోజుల పాటు కొనసాగనున్న దీక్షల విరమణకు అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ 10 కిలోమీటర్లు మేర భక్తుల గిరి ప్రదక్షిణకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్లను ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న వినాయక ఆలయం వద్ద నుంచి ఉచిత దర్శనం కోసం ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.ఒక లైన్ మాత్రం రూ.300లు టికెట్ తీసుకున్న వారికి వీఐపీల దర్శనాల కోసం ఉంచారు. ప్రతిరోజు తెల్లవారు జాము మూడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనాలకు అనుమతించనున్నారు.
ఐదు లక్షల మంది భవానీలు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నామని ఈవో తెలిపారు. భవానీల ఇరుముడి తీసేందుకు గురు భవానీలతో పాటు 50 స్టాండ్ లు,మూడు హోమగుండాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.