అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కూటమి నేతలపై వ్యాఖ్యలను తీవ్రతరం చేశారు. ముఖ్యంగా చంద్రబాబు ( Chandra Babu) పై విమర్శలు చేశారు. ఆదివారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మాట్లాడారు. ఎన్నికల్లో చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మరోసారి మోసం చేస్తున్నారని, బాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టినట్లేనని ఆరోపించారు. వైసీపీ అమలు చేసిన పథకాలు కొనసాగాలంటే వైఎస్సార్ (YCP) తిరిగి అధికారంలోకి రావాలని, చంద్రబాబుకు వేస్తే పథకాలు ముగింపు అవుతాయని పేర్కొన్నారు.
14 ఏండ్ల పాటు సీఎంగా పనిచేసినా చంద్రబాబు గుర్తుకు వచ్చే పథకాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. పేదలకు ఏ ఒక్క మంచి పథకాలు లేవని ఆరోపించారు. జన్మభూమి కమిటీల మీద నమ్మకం ఉంటే అధికారంలో వస్తే తిరిగి ధైర్యంగా పునరుద్దరిస్తావా లేదా అంటూ నిలదీశారు. వాలంటీర్ల వ్యవస్థను తిరిగి తీసుకొస్తానని వెల్లడించారు. 2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు.
రైతుల రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయలేదని దుయ్యబట్టారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ. 25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని అన్నారు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ. 200. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు తలరాతలు రాసే ఎన్నికలని, ప్రజలు ఆలోచించి మంచి చేసే పార్టీకి ఓటు వేయాలని కోరారు.