అమరావతి : కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానస్పదంగా మృతి చెందడంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటన జరిగి 48 గంటలు దాటిపోవస్తున్నా ఇంకా పోస్టుమార్టంకు కుటుంబ సభ్యులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఎమ్మెల్సీని వెంటనే అరెస్టు చేసేంత వరకు పోస్టుమార్టానికి సంతకాలు చేయబోమని ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. దీంతో వీరి ఆచూకి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.
సుబ్రహ్మణ్యం హత్య పట్ల కాకినాడ పట్టణంలో పలు పార్టీలకు చెందిన నాయకులు నిరసన తెలియజేస్తున్నారు. వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రి ఎదుట నిన్నటి నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. బీజేపీ నాయకులు కాకినాడలోని పోలీస్స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు ముందస్తుగా కాకినాడ జీజీహెచ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రైవర్ హత్య ఉదంతంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఈ కమిటీ ఇవాళ కాకినాడకు వస్తుండడంతో పోలీసులు ముందస్తుగా బందోబస్తు చర్యలు చేపట్టారు.