అమరావతి : విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ ఆలయ పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగం నిషేధానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొండపైకి వచ్చేవారిని తనిఖీ చేసి సిగరెట్లు, గుట్కా, పాన్పరాగ్, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులను కోట్సా చట్టం ప్రకారం అనుమతించవద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కోట్సా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని ఆలయ ఈవో, గుడి సెక్యూరిటీ, వైద్య, ఆరోగ్య, పోలీసు శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకునే ప్రధాన మార్గాలైన మెట్లదారి, మహా మండపం, ఘాట్ రోడ్ తదితర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు వినియోగించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా కోట్సా చట్టంపై పోలీసులకు, ఆలయ సిబ్బందికి ఉద్యోగులకు, వ్యాపారస్తులకు అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.ఈనెల 25 నుంచి నిషేధం అమలు చేసేందుకు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.