Balakrishna Fire on Gorantla | హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ప్రజలెంతో నమ్మకంతో గెలిపిస్తే ప్రజా సేవ చేయడం పక్కనబెట్టి నీలి చిత్రాలు చూపించారని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకుని హిందూపురంలో జాతీయ జెండా ఆవిష్కరణకు వచ్చారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లా లేపాక్షిలో బుధవారం సభ జరిగింది. ఈ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారని అన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్పై తీసుకున్న చర్యలేమిటో రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ చెప్పాలని నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఒక్కఛాన్స్ అని ఏపీ ప్రజలను మోసగించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. చేతకాని పాలనతో ప్రజలను కష్టాల్లో ముంచెత్తారని అన్నారు. అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలను తీవ్రంగా మోసగించిందన్నారు. కనీసం రైతులకు ఎరువులు, విత్తనాలు కూడా ఇవ్వడం లేదన్నారు.
హిందూపురంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన నందమూరి బాలకృష్ణకు తూముకుంట చెక్పోస్ట్ వద్ద టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అటుపై బాలకృష్ణ తన భార్య వసుంధరా దేవితో కలిసి హిందూపురం రూరల్ మండలం చలివెందులలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించారు.