అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఈ మేరకు నియోజకవర్గాల నేతలతో గత వారం రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి పేరును ఖరారు చేశారు. గత ఎన్నికల్లో పులివెందుల నుంచి టీడీపీ టికెట్పై పోటీచేసిన సతీష్రెడ్డి.. గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండటంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది.
ఇక్కడి నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి మళ్లీ వస్తున్నారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతున్నట్లు సమీక్ష సందర్భంగా కొందరు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో సతీష్రెడ్డికి టికెట్ కేటాయింపు, బీటెక్ రవి అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. ఆ మేరకు నేతలంతా పార్టీ శ్రేణులతో కలిసి ముందుకు సాగాలని, స్థానికంగా టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా కూడా కొనసాగుతున్నారు. 2017 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ సొంత ఇలాకాలో ఆయన బాబాయి వైఎస్ వివేకానందను ఓడించి ఆశ్చర్యపరిచారు. అంతకు ముందు 2011 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ చేతిలో పరాజయం పాలయ్యారు.
సతీష్ రెడ్డి ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. అయినప్పటికీ పులివెందుల అభ్యర్థిగా బీటెక్ రవిని ఖరారు చేయడం హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు రెండేండ్ల ముందే టీడీపీ ప్రకటించిన తొలి అభ్యర్థి బీటెక్ రవి కావడం విశేషం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో బీటెక్ రవి పోటీ పడనున్నారు. కడప జిల్లాలో టీడీపీ జెండా ఎగరేయాలన్న కసితో ఉన్న చంద్రబాబు.. ఆ మేరకు బీటెక్ రవి పేరును ప్రకటించినట్లుగా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.