తిరుమల : లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల(Tirumala) లోని నాదనీరాజనం వేదికపై ఆదివారం ఉదయం నిర్వహించిన 6వ విడత అయోధ్యకాండ(Ayodhyakanda) అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. దాదాపు రెండు గంటల పాటు అయోధ్యకాండలోని 18 నుంచి 21వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 199 శ్లోకాలను వేదపండితులు పారాయణం చేశారు.
యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 224 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు డాక్టర్ కె.రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, డాక్టర్ మారుతి శ్లోక పారాయణం చేశారు. అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల(Dharmagiri Veda patasala, ), ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థకు చెందిన వేదపారాయణదారులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు(Annamacharya Project) కళాకారులు శ్రీనివాస్ బృందం ‘రామా సీతారామా’ అనే రామదాసు కీర్తనను, ‘రాముని భజన సేయవే మనసా’ అనే నామ సంకీర్తనను రసరమ్యంగా ఆలపించారు.