అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని జలుమూరు మండలం యలమంచిలి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో తల్లితో పాటు కూతురు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో చిన్నమ్మడు(46), జాహ్నవి(17) గా గుర్తించారు. మరో కూతురు రజిని, కుమారుడు వెంకటసాయి శశాంక్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు.
వీరిని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ యజమని నరసింహులు ఒక గదిలో నిద్రిస్తుండగా మిగిలిన కుటుంబ సభ్యులు మరో గదిలో నిద్రిస్తూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియరాలేదు.