అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో టీడీపీ సీనియర్నేత అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ కూల్చివేతపై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. కూల్చివేతను టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. అర్ధరాత్రి అయ్యన్న ఇంటికి వెళ్లిన అధికారులు, సిబ్బంది ప్రహరీని అక్రమంగా కూల్చివేయడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు.
టీడీపీలో ఉన్న బలమైన బీసీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, దాడులకు పాల్పడుతూ ఏపీ సీఎం జగన్ బెదిరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు విసిరిన ప్రశ్నలకు ధైర్యం లేక కూల్చివేతలకు పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. టీడీపీ పార్టీ అయ్యన్నకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.