ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావుపై అట్రాసిటీ కేసు నమోదైంది. కులం పేరుతో మాజీ మంత్రి తనను దూషించారంటూ ఓ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.
ఏ1 గా ప్రత్తిపాటి పుల్లారావు, ఏ2గా మదన్మోహన్, ఏ3గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4గా శ్రీనివాస రావును ఈ కేసులో పోలీసులు చేర్చారు. 323,34, 353, 506,509 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేటలో పాత మంచినీటి చెరువు పక్కన ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో ఓ వాటర్ ప్లాంట్ను ప్రత్తిపాటి ప్రారంభించారు. కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లాంట్ అసలు పనిచేయడం లేదు. దీనిని తిరిగి ప్రారంభిస్తామని టీడీపీ పేర్కొంది. అంతేకాకుండా మున్సిపల్ స్థలంలో రెండు బోర్లు కూడా వేశారు. దీనికి మున్సిపల్ అధికారులు అభ్యంతరం చెప్పారు.
అనుమతులు లేవన్నారు. అయినా పట్టించుకోకుండా ప్రత్తిపాటి పుల్లారావు సారథ్యంలో టీడీపీ నేతలు ఆ స్థలానికి వచ్చారు. ఈ సమయంలోనే టౌన్ ప్లానింగ్ అధికారిణి విషయంలో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.