అమరావతి : ఏపీలోని ఏలూరు (Eluru) జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై, అడ్డువచ్చిన మరో నలుగురిపై కత్తితో దాడి చేసి బీభత్సం సృష్టించాడు. జిల్లాలోని పెద్దవేగి మండలం వేగివాడలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. వేగివాడలో నివాసం ఉంటున్న ఓ దంపతులు తమ కుమార్తెను షేక్బాజీ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. కొంతకాలం తరువాత నూతన దంపతుల మధ్య గొడవలు ప్రారంభం కావడంతో మనస్తాపానికి గురై షేక్బాజీ భార్య పుట్టిళ్లు అయిన వేగివాడకు తిరిగి వచ్చేసింది.
తన భార్యను తనతో పంపించాలని అనేకసార్లు కోరినా అత్త, భార్య, పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో మంగళవారం అత్త ఇంటికి వచ్చి ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన స్థానికులపై దాడి చేయడంతో నలుగురికి గాయాలయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అత్త చనిపోగా, గాయాలపాలైన స్థానికులను ఏలూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.