నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 61.75 శాతం పోలింగ్ నమోదైనట్లు పోలింగ్ అధికారులు చెప్పారు. 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లోనే క్యూలైన్లలో సాయంత్రం 6 తర్వాత ఇంకా ఓటర్లు ఉన్నారు. వైసీపీ తరపున గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్ర౦రెడ్డి, బీజేపీ తరఫున భరత్కుమార్తో పాటు మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 26న కౌంటింగ్ జరుగనున్నది.
మొత్తం 279 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగ్గా.. పలు ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్ష పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు మధ్యవర్తిత్వంతో ప్రశాంతత నెలకొన్నది. 1,339 జనరల్, 1032 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. వీరితోపాటు 142 మంది మైక్రో అబ్జర్వర్లు, 38 మంది సెక్టార్ అధికారులు విధులు నిర్వహించారు.
పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు చాలా పలుచగా ఉండటంతో త్వరగా పోలింగ్ ముగించారు. కొన్ని ఖాళీగా ఉండటంతో పోలింగ్ కేంద్రాలను మూసివేశారు. ఈవీఎం బాక్సులను ప్యాక్ చేసి తీసుకు వెళ్లే ప్రక్రియను ప్రారంభించారు. లక్ష మెజారిటీని సాధించాలన్న లక్ష్యంతో వైసీపీ ఉండగా.. గెలిచి తీరాలన్న పట్టుదలతో బీజేపీ ఉన్నది.