Srisailam | ఆత్మకూరు ఎస్డీపీవో ఉదారత చాటుకున్నారు. శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలకు వచ్చి తిరుగు ప్రయాణంలో బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న కర్ణాటకలోని గుల్బార్గాకు చెందిన భక్తులకు సాయం అందించారు. వారికి భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా.. కేఎస్ఆర్టీసీతో మాట్లాడి ప్రత్యేకంగా బస్సులు వేయించారు.
శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాల ముగియడంతో భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. మంగళవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి రథ మహోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తులు తమ సొంత ప్రాంతాలకు బయల్దేరారు. ఈ క్రమంలో కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన భక్తులకు చేదు అనుభవం ఎదురయ్యింది. రాత్రి సమయంలో సొంతూరికి వెళ్లేందుకు బస్సులు లేవు. దీంతో గుల్బార్గాకు చెందిన భక్తులు ఆందోళన చేపట్టారు. శ్రీశైలం బస్టాండ్ వద్ద ధర్నాకు దిగారు.
విషయం తెలుసుకున్న ఆత్మకూరు ఎస్డీపీవో వెంటనే అక్కడకు చేరుకుని భక్తులతో మాట్లాడారు. వారికి తినేందుకు భోజనం కూడా లేదని చెప్పడంతో తమ వద్ద ఉన్న భోజనం, మంచి నీటిని అందజేశారు. అనంతరం కేఎస్ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా బస్సులు వేయించారు.