అమరావతి : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముత్యాల నాయుడు ఇవాళ వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తాగునీటితో పాటు పారిశుద్ధ్యం మెరుగుపరిచేలా కార్యాచరణ తీసుకుంటామని వెల్లడించారు.
1988లో వార్డు మెంబర్ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు వచ్చానని తెలిపారు. కేంద్రం నుంచి పంచాయతీలకు నిధులు వచ్చేలా కృషి చేస్తానని, రహదారుల నిర్మాణం, మరమ్మతులకు త్వరలో టెండర్లు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రానికి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు తీసుకొస్తానని అని వెల్లడించారు. 2026 వరకూ పాత జిల్లాల్లోనే జడ్పీలను కొనసాగించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైల్ పై మొదటి సంతకం చేశారు. మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏపీలో సాధిస్తామని అన్నారు.