Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మ వార్లకు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఆదివారం ఆరుద్ర నక్షత్రం సందర్బంగా ఉదయం గర్బాలయంలో మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక వేదపండితులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. అనంతరం వృద్దమల్లికార్జున స్వామికి లక్షబిల్వార్చన, పంచామృతాభిషేక పూజలు చేశారు.
శ్రీశైల మహా క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి అధికంగా ఉంది. వారాంతపు సెలవులతోపాటు డ్యాం గేట్లు తెరవటంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర ప్రధాన వీధులు కిటకిటలాడాయి. తెల్లవారుజామునుండే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనాలతోపాటు గర్బాలయ అభిషేకాలు, బిల్వార్చనలు, వీఐపీ బ్రేక్, స్పర్శ దర్శనాలు జరిగాయి.
భక్తులు అన్ని రకాల దర్శనాల్లో అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అదే విధంగా అలంకార మండపంలో సామూహిక అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలను చేసుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. క్షేత్ర పరిధిలో బస చేసేందుకు వసతి సదుపాయాలు మెరుగుపర్చాలని దేవస్థానం అధికారులను యాత్రికులుకోరుతున్నారు.