అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన రియల్టర్ హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేయగా నిందితులకు సహకరించారన్న అభియోగంపై ప్రకాశం జిల్లా పోలీసులు తహసీల్దార్పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పి మలిక్ గార్గ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ప్రకాశంజిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీకి చెందిన ఆదినారాయణ, గురుప్రసాద్ల మధ్య గత కొంతకాలంగా భూవివాదం కొనసాగుతుంది. దీంతో గురు ప్రసాద్ ఆదినారాయణను హత్య చేయాలని పథకం పన్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన కానాల వెంకట నారాయణ రెడ్డి, పోలిశెట్టి అశోక్, జలగిరి రాజశేఖర్, ఎర్రగొండ పాలెంకు చెందిన జగన్నాధం మస్తాన్, దిగుమర్తి ఆదినారాయణను సంప్రదించాడు.
ఈనెల 16న గోశాల నుంచి ఎర్రగొండపాలెం వస్తున్న ఆదినారాయణను దారికాచి అడ్డగించి కళ్లల్లో కారం చల్లి కత్తులతో అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. హత్యకేసును సవాలుగా తీసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు అంగీకరించారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడు గురుప్రసాద్కు భూమిపై హక్కుల విషయంలో ఎర్రగొండపాలెం తహసీల్దార్ వాడాల వీరయ్య సహకరించినట్టు గుర్తించి అతడిపై కూడా కేసు నమోదు చేశామన్నారు.
ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్టు నిందితుల నుంచి హత్యకు వినియోగించిన మూడు కత్తులు, ఐదు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నామని ఆమె వెల్లడించారు.