విజయవాడ: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో మంగళవారం నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, తదితర ఉన్నతాధికారులు కూడా మంత్రి వెంట ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ సీఏం జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు.
జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్టేడియంలో నిర్వహిస్తున్న మహిళా సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై చర్చిస్తారని మంత్రి వనిత మీడియాకు తెలిపారు. సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని, డ్వాక్రా మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారని అన్నారు. మహిళల్లో రాజకీయ సాధికారత సాధించేందుకు మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. వివిధ పథకాల అమలుతో మహిళా సాధికారత సాధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు కూడా మంత్రి వనిత వెంట ఉండి ఏర్పాట్లను పరిశీలించారు.