Srisailam | శ్రీశైల ఆలయ ప్రాంగణంలో జరిగే మహాకుంభాభిషేక మహోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి సమీక్షించారు. కుంభాభిషేకం సందర్భంగా పరంజాలు, ఆలయ ప్రాంగణంలో యాగశాలల ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. మహా కుంభాభిషేక మహోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని, అధికారులను ఆదేశించారు.
అంతకుముందు శ్రీభమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తులకు సౌకర్యాలను రెడ్డివారి చక్రపాణి రెడ్డి పరిశీలించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. క్యూ లైన్లలో భక్తుల రద్దీకి అనుగుణంగా నిరంతరం మంచినీరు సరఫరా చేయాలని సూచించారు. క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు అల్ఫాహారం, బిస్కట్లు పంపిణీ చేయాలని చెప్పారు. దేవస్థానం ఏర్పాట్లపై భక్తులతో ముఖాముఖి మాట్లాడి వసతుల కల్పనపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విరాళాల పథకాలను భక్తులకు, దాతలకు వివరంగా తెలియచేస్తూ ఉండాలని విరాళాల సేకరణ సిబ్బందికి రెడ్డివారి చక్రపాణి రెడ్డి సూచించారు. ఆలయ దర్శన వేళలు, ఆర్జిత సేవల నిర్వహణ సమయాలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు వివరిస్తూ ఉండాలని చెప్పారు.
టూరిస్ట్ బస్టాండ్ సమీపాన భక్తుల వసతి కోసం 224 గదుల సముదాయంగా నిర్ణయించిన గణేశ సదన నిర్మాణ పనులను రెడ్డివారి చక్రపాణి రెడ్డి పరిశీలించారు. నాలుగు బ్లాక్ ల్లో 224 గదులు నిర్మిస్తున్నారు. ఏ బ్లాక్ లో 36 గదులు, ఎనిమిది ఘాట్లు, బీ బ్లాక్ లో 64 గదులు, సీ బ్లాక్ లో 48 గదులు, డీ బ్లాక్ లో 64 గదులు నిర్మించారు. గణేశ సదనంలో ఫినిషింగ్ పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వసతి సముదాయ ప్రాంగణానికి ఎడమ వైపున గల ఆరు బయలు ప్రదేశంలో వీలైనంత మేరకు పార్కింగ్ ప్రదేశాన్ని కూడా అభివ్రుద్ధి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆదేశించారు. ఈ పార్కింగ్ ప్రదేశంలో నీడనిచ్చే మొక్కలు నాటాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వీ రామక్రుష్ణ, ఎం నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వాహణాధికారి ఎం ఫణిదర్ ప్రసాద్, పర్యవేక్షకులు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.