తిరుమల : ముంబైలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ భూమి పూజకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవీ ముంబైలోని ఉల్వేలో భగవాన్ బాలాజీ కా మందిర్ (శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం) భూమి పూజ ఈ నెల 21న జరుగనున్నది. భూమి పూజ కార్యక్రమానికి రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు.
గురువారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈఓ ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముంబైలో శ్రీవారి ఆలయ భూమి పూజ కార్యక్రమం కోసం ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. కోస్టల్ కారిడార్ పక్కనే నవీ ముంబై సమీపంలోని ఉల్వే వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది. రానున్న రెండేండ్లలో ఈ ఆలయం కేంద్ర బిందువుగా మారనున్నది. ఈ భూమి పూజ కార్యక్రమానికి పలువురు పెద్దలు హాజరవనున్నారు.
‘ఇప్పటికే వైఖానస ఆగమ సూత్రాల ప్రకారం ఆలయ సంబంధిత ఆచార వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 10న తిరుమల ప్రధాన అర్చక వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో విశ్వకేన ఆరాధన, పుణ్యాహవచనం, కన్యా పూజ, వృషభ పూజ, భూకర్షణం, బీజవాపనం జరిగాయి.
ప్రధాన ఆలయ వ్యయం రూ.100 కోట్లు కాగా, మిగిలిన నిర్మాణాలు మరో రూ.100 కోట్లు ఖర్చవుతాయని అంచనా. మొత్తం ఆలయ నిర్మాణ వ్యయాన్ని నిర్వహించడానికి రేమండ్ సంస్థ అధినేత గౌతమ్ సింఘానియా ఇప్పటికే ముందుకు వచ్చారు’ అని ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్, సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ-2 జగదీశ్వర్ రెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.