అమరావతి : అమరావతి ఏకైక రాజధాని కోసం అమరావతి పరిరక్షణ సమితి రేపు( శుక్రవారం)మధ్యాహ్నం తిరుపతి సమీపంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సభకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో గురువారం దాదాపు 20 ఎకరాల ప్రైవేట్ స్థలంలో ఏర్పాట్ల పనులకు జేఏసీ నాయకులు పూజలు చేసి ప్రారంభించారు. కోర్టు ఆదేశాలకు లోబడి కార్యక్రమాలు జరుగుతాయని వారు స్పష్టం చేశారు.
ఈ సభకు అన్ని ప్రధాన పార్టీల రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు, ప్రజాసంఘాలకూ ఆహ్వానం పంపారు. విభాగాల వారీగా ప్రత్యేక గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, సభకు వచ్చే వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. తెదేపా, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం వంటి అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు, ప్రజా, రైతు, వర్తక, వాణిజ్య సంఘాలను ఆహ్వానించామని నిర్వాహకులు వెల్లడించారు.