తిరుపతి : తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రేపు(గురువారం) నిర్వహించే సంప్రోక్షణలో ఏపీ సీఎం జగన్ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆయన వెల్లడించారు. శ్రీ వకుళ మాత ఆలయం వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీటీడీ సహాకారంతో శ్రీ వకుళ మాత ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు.
మూడు సంవత్సరాల కాలంలో ఆలయాన్ని రాతి కట్టడం, అద్బుత శిల్ప కళతో నిర్మించినట్లు చెప్పారు. వకుళ మాత ఆలయం వద్ద 83 ఎకరాల 42 సెంట్ల భూమి ఉందని, ఈ ప్రాంతంలో టీటీడీ కల్యాణ మండపం, అతిధి భవనం నిర్మిస్తుందన్నారు. టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్యులు మాట్లాడుతూ స్కంధ, వరాహ, భవిష్యోత్తర పురాణాల ప్రకారం శ్రీ వకుళ మాత తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి మాతృమూర్తి అని వివరించారు. మంత్రి దాదాపు 20 కేజీల బంగారంతో ఆలయ గోపురానికి 5 కలశాలు, విమానానికి ఒక కలశం టీటీడీ సహకారంతో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.