విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ (ఏపీఎస్ ఆర్టీసీ) బంపరాఫర్ ప్రకటించింది. తమ కొత్త బ్రాండ్కు మంచి పేరు చెప్పిన వారికి క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అద్భుత అవకాశాన్ని కల్పించింది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా.. చిన్న సలహా ఇవ్వండి.. క్యాష్ ప్రైజ్ సొంతం చేసుకోండి అని ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ కొత్తగా తీసుకొస్తున్న నాన్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు సర్వీసులకు మంచి పేరు చెప్పాలని రాష్ట్ర ప్రజలను కోరింది. ఈ అవకాశాన్ని వినియోగించి బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా తమ సర్వీసులకు పేరును సూచించాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు విజ్ఞప్తి చేశారు.
ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో 30 బెర్త్లు ఉంటాయి. తొలిసారి ఏపీలో ఈ బస్సుల్ని తీసుకువస్తున్నారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం అద్దె ప్రాతిపదికన ఈ నాన్ ఏసీ స్లీపర్ కోచ్లను ప్రవేశపెడుతున్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రేట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ స్లీపర్ కోచ్లో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత ఫ్యాన్, లైట్ ఉంటుంది. ఈ నాన్ ఏసీ స్లీపర్ కోచ్లను తీసుకువచ్చి ప్రయాణికులను ఆకర్షించేలా ఆర్టీసీకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని భావిస్తున్నారు. అందుకే స్లీపర్ కోచ్లకు మంచి పేరు సూచించాలని ఎండీ కోరుతున్నారు. ఈ నెల 24లోగా తగిన పేరు సూచించిన వారికి అవార్డుతోపాటు నగదు రివార్డు ఇవ్వనున్నారు.