Chandrababu Naidu | ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సీఐడీ సంచలన అభియోగాలు మోపింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని, చంద్రబాబే కుట్రకు సూత్రదారి ఆరోపించింది. ఆయన ఆదేశాల మేరకే నిధులు విడుదలయ్యాయని వెల్లడించింది. టీటీడీ నేత ఇల్లందుల రమేశ్ ద్వారా డిజైన్టెక్, సీమెన్స్ తదితరులు చంద్రబాబును కలిశారని పేర్కొంది. అయితే, రిమాండ్ రిపోర్ట్లో చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ పేరును సైతం జతచేసింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారి రాజేశ్ ద్వారా లోకేశ్కు డబ్బులు అందించినట్లు పేర్కొంది. కేబినెట్ తీర్మానాలను పక్కనపెట్టి గంటా సుబ్బారావు, లక్ష్మినారాయణలాంటి అధికారుల ద్వారా బాబు కుట్రకు పాల్పడ్డారని రిమాండ్ రిపోర్ట్లో సీఐడీ తెలిపింది.
అచ్చెన్నాయుడు నేతృత్వంలో స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేశారని, కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన పవర్పాయింట్ ప్రజంటేషన్ల ఆధారంగానే ప్రాజెక్టును ఆమోదించారు. అయితే, ప్రాజెక్టుకు సంబంధించి మార్కెట్ సర్వే జరుగలేదని, ఎలాంటి ప్రాజెక్టు రిపోర్టు లేకుండానే సీమెన్స్ సంస్థ ఇచ్చిన డీఆర్ ఆధారంగా రూ.3,281 కోట్ల బడ్జెట్ను కేబినెట్ ఎదుట పెట్టారని, దీనికి సంబంధించిన నోట్ఫైల్ను చంద్రబాబు, అచ్చెన్నాయుడును అప్రూవ్ చేశారని అభియోగాలను తెలిపింది. 98శాతం ఖర్చు సీమెన్స్ భరిస్తుందని కేబినెట్ అబద్ధాలు చెప్పారని పేర్కొంది.
ఎలాంటి పెర్ఫార్మెన్స్, బ్యాంకు గ్యారెంటీ లేకుండానే ప్రభుత్వం రూ.371 కోట్లను డిజైన్ టెక్కు ఇచ్చేసిందని, అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి కే సునీత అభ్యంతరాలను పట్టించుకోలేదని.. అప్పటి సీఎం, సీఎస్ ఆదేశాలతోనే నిధులు విడుదలయ్యయాని పేర్కొంది. పలు షెల్ కంపెనీల ద్వారా డిజైన్టెక్ కంపెనీ రూ.279 కోట్లు దారి మళ్లించారని, జీవో నంబర్ 4ను ఆర్థికశాఖ అభ్యంతరాలను అతిక్రమించి చంద్రబాబు ఈ కుట్రలో కీలక భాగస్వామి అయ్యారంటూ సీఐడీ వివరించింది. మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు, అచ్చెన్నాయుడు కుట్రే కారణమని తెలిపింది. కుట్రపై జీఎస్టీ విచారణ మొదలవగానే, నిందితులు నోట్ఫైల్స్ మాయం చేశారని సీఐడీ పేర్కొంది. కేబినెట్లో అత్యవసర ఐటెం కింద పెట్టి ప్రపోజల్ను ఆమోదించారని.. ఏసీబీకి సమర్పించిన 28 పేజీల రిమాండ్లో తెలిపింది.