అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ మంగళవారం వెల్లడించింది. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు. గ్రూప్ 1 పరీక్షలు 2018 లో జరిగాయి.
మొత్తం 167 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ ఇచ్చి.. 165 పోస్టులను భర్తీ చేసింది. మిగిలిన రెండు స్థానాలను స్పోర్ట్స్ కోటా కోసం రిజర్వ్ చేసింది. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్లో డిప్యూటీ కలెక్టర్లు (30), అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్స్ (8), డీఎస్పీలు (27), ఎంపీడీవోలు (47 ), డీఎస్పీ (జైళ్ల శాఖ-1), డీఎఫ్ఓ (1), అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్లు (11), ఆర్డీవోలు (5), జిల్లా రిజిస్ట్రార్లు (1), ఎస్పీ సంక్షేమ అధికారి (1), బీసీ సంక్షేమ అధికారి (1), డీపీఓ (1), గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు (1), వైద్యారోగ్య పరిపాలనలో అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు (6), అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (6) తదితర పోస్టులున్నాయి.
నాలుగేండ్ల సుధీర్ఘ విరామం తర్వాత గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. 167 పోస్టుల భర్తీకి లక్షన్నర మంది హాజరుకాగా, 325 మంది ఇంటర్వ్యూ వరకు వచ్చినట్లు చెప్పారు. కోర్టు తీర్పునకు లోబడి ఈ ఫలితాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. డిజిటల్ పద్ధతిలో వ్యాల్యూయేషన్ జరిపామన్నారు. వచ్చే నెలలో గ్రూప్1, 2 నోటిఫికేషన్లు జారీ చేస్తామని వెల్లడించారు. మూల్యాంకనం అంత పూర్తి పారదర్శకంగా జరిగినందున అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.