అమరావతి : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల( YS Sharmila) నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ(AICC) ప్రకటన విడుదల చేసింది. షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని అధిష్టానం ప్రకటించింది. నిన్న సోమవారం ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిల నియామకం జరగడం విశేషం. కాంగ్రెస్లో చేరిన 15 రోజుల్లోనే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు దక్కింది.
తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కూతురు వైఎస్ షర్మిలకు అవకాశం రావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా షర్మిల ప్రభావం అధికార, విపక్ష పార్టీలపై పడే అవకాశముందని భావిస్తున్నారు.