అమరావతి : ఏపీలో నూతన బార్ల కేటాయింపునకు ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది. నూతన బార్ల విధానంలో రాష్ట్రంలో 840 బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్శాఖ లైసెన్సులు మంజూరు చేయనుంది. వాటిని ఈ-వేలం ద్వారా కేటాయించే ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈనెల 27 వరకు దరఖాస్తుదారులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 2025, ఆగస్టు 31 వరకు మూడేళ్లకు ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేయనుంది. దరఖాస్తుల నమోదు, ఫీజుల చెల్లింపు, జిల్లాల వారీగా ఈ-వేలం, ఇందులో పాల్గొనేవారి అర్హతలను పేర్కొంటూ నోటిఫికేషన్ జారీచేశారు. ప్రాసెసింగ్ ఫీజు, నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చారు. దరఖాస్తుల సమర్పణ, ఈ-వేలం నిర్వహణకు జోన్ల వారీగా తేదీలను నిర్ణయించారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పరిధిలో 128, విజయవాడలో 110, గుంటూరులో 67, నెల్లూరులో 35 చొప్పున బార్లకు ఈ-వేలం వేయనున్నామని ఎక్సైజ్ కమిషనర్ వెల్లడించారు.