YS Sharmila | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పనుల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన చంద్రబాబు.. మద్యం సిండికేట్లను అరికట్టడంలో రాజకీయ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికక్కడే అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను దక్కించుకున్నారని తెలిసిందని తెలిపారు.
కూటమి సిండికేట్లకే 3 వేలకు పైగా మెజారిటీ షాపులు దక్కాయంటే మీ పారదర్శకత, నిస్పాక్షికత ఎంత గొప్పగా ఉందో అర్థం అవుతుందని చంద్రబాబును ఉద్దేశించి షర్మిల అన్నారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల కనుసన్నల్లోనే టెండర్ల ప్రక్రియ సాగిందని అన్నారు. సాధారణ ప్రజలకు షాపులు దక్కకుండా రాష్ట్ర వ్యాప్తంగా బెదిరింపులకు పాల్పడ్డారని.. ప్రాణాలు పోతాయని హెచ్చరికలు చేశారని ఆరోపించారు. కూటమి నేతలకు కాదని పొరపాటున ఎవరికైనా లాటరీ చిక్కితే, లైసెన్స్ ఇస్తారా ? లేక 30 శాతం కమీషన్ ఇస్తారా ? లేకుంటే చస్తారా ? అంటూ బెదిరించారని అన్నారు. మమ్మల్ని కాదని మద్యం ఎలా అమ్ముతారో చూస్తాం అంటూ బహిరంగంగానే సవాళ్లకు పాల్పడ్డారని మండిపడ్డారు. సీఎం గారు! ఏసీ రూముల్లో కూర్చుని హెచ్చరికలు జారీ చేస్తే సరిపోతుందా? చర్యలు ఏవి అని ప్రశ్నినంచారు.
గత వైసీపీ “only cash” అని గుడిని మింగేస్తే ఇప్పుడు మీరు లింగాన్ని మింగేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై షర్మిల మండిపడ్డారు. ప్రైవేటు పేరుతో తక్కువ ధర అని చెప్పి, మద్యం ఏరులై పారించి, వేల కోట్లు దోపిడీకి కూటమి సర్కార్ తెరలేపిందని ఆరోపించారు. అందుకేనేమో మీ పాపాల చిట్టాలు రేపు బయటపడకుండా ఉండటం కోసం, పాత సర్కారు మద్యం స్కాములోని పాపాలపుట్టలు బద్దలుకాకుండా జాగ్రత్త పడుతున్నారని విమర్శించారు.