అమరావతి : సాధారణ వైద్య విద్యార్థులతో సమానంగా గౌరవవేతనం ఇవ్వాలని, పశువైద్య ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలో పశువైద్య , పట్టభద్ర విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కృష్ణా జిల్లా గన్నవరం, తిరుపతి, కడప జిల్లా ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాలల ఆవరణలో విద్యార్థులు ఆందోళనను ప్రారంభించారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ అమలు చేయడం లేదని విద్యార్థులు వాపోయారు.
సాధారణ వైద్యవిద్యతో సమానమైన వృత్తిగా పశువైద్య విద్యను గుర్తిస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,217 గ్రామీణ పశు వైద్యశాలల్ని అప్గ్రేడ్ చేయాలని, ప్రభుత్వం ప్రారంభించనున్న 365 సంచార పశువైద్యశాలల్లో పశువైద్య పట్టభద్రులతో నియమించాలని డిమాండ్ చేశారు.
పశు వైద్య విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాన్ని.. సాధారణ వైద్య విద్యార్థుల స్థాయిలో పెంచాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్కు స్పందించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని పశువైద్య విద్యార్థులు, పట్టభద్రులు హెచ్చరించారు.