అమరావతి : ఏపీలో కొత్త పీఆర్సీ అమలుపై ఏపీ ట్రెజరీ ఉద్యోగులు సందిగ్ధతకు గురవుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు జమ చేయాలని ప్రభుత్వం ఒత్తిళ్లు తీసుకువస్తుండడంతో ట్రెజరీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు డైరెక్టర్ ఆఫ్ టైజరీ అండ్ అకౌంట్స్కు ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం నాయకులు లేఖను రాసారు. కొత్త పేస్కేళ్ల ప్రకారం బిల్లులు ప్రాసెస్ చేయాలంటే ఎస్ఆర్లు కావాలి, ఎస్ఆర్లు పరిశీలించాకే ప్రాసెస్ చేయగలమని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజు ల్లోబిల్లుల పరిశీలన కష్టమని లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రాసెస్కు మరికొంత సమయం పడుతుందని బిల్లులతో పాటు ఎస్ఆర్లు అందుబాటులోకి వస్తే తప్ప ఏమీ చేయలేమని వెల్లడించారు. ఇప్పటికే పాత పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలంటూ ట్రెజరీ అధికారులకు లక్షల మంది ఉద్యోగులు లేఖలు రాస్తుండడంతో టైజరీ ఉద్యోగులు సందిగ్ధంలో పడ్డారు. తమకు సమయం ఇవ్వకపోతే పొరపాట్లతో ప్రజాధనం నష్టపోయే ప్రమాదముందని వారు పేర్కొన్నారు.