విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులు ‘గవర్నెన్స్ నౌ-2022’ అవార్డులను 14 గెలుచుకున్నారు. అత్యాధునిక సాంకేతికత వినియోగంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నాలుగు పోలీస్ హెడ్ క్వార్టర్స్, విశాఖపట్నం సిటీ, శ్రీకాకుళం, కాకినాడ, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల పోలీస్ డివిజన్లకు ఒక్కో అవార్డు, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాలకు రెండేసి అవార్డులు వచ్చినట్లు పోలీసు శాఖ తెలిపింది.
శ్రీకాకుళం కమ్యూనిటీ పోలీసింగ్, విశాఖపట్నం సిటీ ఉమెన్ సెక్యూరిటీ, కాకినాడ స్ట్రాటజిక్ రెస్పాన్స్ సెంటర్, ఎన్టీఆర్ ఈ-పోలీసింగ్ ఇనిషియేటివ్, రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ప్రకాశం సర్వైలెన్స్ అండ్ మానిటరింగ్, క్రైమ్ డిటెక్షన్లో చిత్తూరు టెక్నాలజీ వినియోగం, తిరుపతి ఉమెన్ సెక్యూరిటీ, పోలీసింగ్ ఇనిషియేటివ్ టెక్నాలజీ, కడప కమాండ్ అండ్ కంట్రోల్ విభాగం ఈ అవార్డులను గెలుచుకున్నాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్లో పోలీస్ హెడ్క్వార్టర్స్ రెండు అవార్డులను, పోలీస్ ఆధునీకరణలో మరో రెండు మొత్తం నాలుగు అవార్డులను గెలుచుకున్నది.
ఈ సందర్భంగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే ఏపీ పోలీస్ శాఖ అగ్రగామిగా కొనసాగుతుండటం హర్షనీయమన్నారు. తక్కువ కాలంలోనే మొత్తం 189 జాతీయ అవార్డులు సాధించడం తమ శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నా క్షేత్రస్థాయిలో వాటి ఉపయోగాలు అందించి ప్రజలకు సత్వర న్యాయం అందినప్పుడే దానికి సార్థకత ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసు శాఖను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలపడంలో మార్గదర్శనం చేస్తున్న సీఎం జగన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.