YS Sharmila | కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి HD కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీ ప్రజలను అవమానించినట్లే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని అపహస్యం చేసినట్లు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రతిపాదన వస్తే ఆలోచన చేస్తామని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలతో బీజేపీ చెలగాటం ఆడుతుంది అనడానికి నిదర్శనమని చెప్పారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎంపీలు మౌనంగా ఉండటం వారి చేతకానితనానికి అద్దం పడుతుందని ధ్వజమెత్తారు.
కడప ఉక్కు సీమ ప్రజల హక్కు అని షర్మిల తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమే SAIL ఆధ్వర్యంలో నిర్మించి ఇచ్చేలా కాంగ్రెస్ సారథ్యంలోని UPA ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. విభజన చట్టంలోనూ పెట్టిందని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ విభజన హామీలను కాల రాసిందని మండిపడ్డారు. సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. కడప ప్రజలకు తీరని ద్రోహం చేసిందని.. తిరుపతి వేదికగా కడప స్టీల్ పై హామీ ఇచ్చిన మోదీ తర్వాత సాధ్యం కాదని, సొంత గనులు లేకుండా కష్టమని, లాభదాయకంగా లేదని సన్నాయి నొక్కులు నొక్కారని విమర్శించారు.
కడప స్టీల్పై మీ వైఖరి ఏంటి ? కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రకటనకు మీరిచ్చే సమాధానం ఏంటి ? అసలు కేంద్రం పరిశీలనలో లేదనడం మీరు సమర్ధిస్తారా ? కడప స్టీల్ ప్లాంట్ కడతారా ? కట్టరా? దీనిపై సూటిగా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్పై మీ ముసుగు తీయండి సార్ అని వ్యాఖ్యానించారు. అనాడు బీజేపీ మోసం చేసిందని, కేంద్రం సహకరించకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కడుతుందని ఒకసారి మీరు కొబ్బరి కాయ కొడితే… రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు సార్లు టెంకాయలు కొట్టారని అన్నారు. నాలుగు సార్లు శంకుస్థాపన జరిగి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలని ప్రాజెక్టు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కడప స్టీల్ మాత్రమే అని విమర్శించారు.
కేంద్రంలో బీజేపీ మూడో సారి అధికారంలో ఉందంటే మీ మద్దతు తోనే అని చంద్రబాబును ఉద్దేశించి షర్మిల అన్నారు. మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే, మోదీ ఇచ్చిన పదవులు ముఖ్యం కాకపోతే, విభజన హక్కు ప్రకారం కడప స్టీల్ ను కేంద్రం నిర్మించి ఇచ్చేలా ప్రకటన చేయించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. లేకుంటే భేషరతుగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి బీజేపీ కి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం సహాయం లేకుండా రాష్ట్రమే నిర్మించే పనికి మోదీకి భజన చేయాల్సిన అవసరం ఉందా.. తేల్చుకోవాలని హెచ్చరించారు.